Viral Video: జస్ట్ మిస్.. బెంగళూర్ హైవేపై తప్పిన ప్రమాదం.. నెట్టింట వీడియో వైరల్..

  • బెంగళూర్-హైదరాబాద్ హైవేపై తృటిలో తప్పిన ప్రమాదం..
  • ప్రైవేట్ ట్రావెల్ నిర్లక్ష్యపు డ్రైవింగ్..
  • వెనక వాహనం డాష్ కెమెరాలో వీడియో రికార్డ్..
  • వాహనదారుడిని కూడా తప్పుపడుతున్న నెటిజన్లు..
Viral Video

Viral Video

Viral Video: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నటేకూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బస్‌లో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ ఓవర్ స్పీడ్, సరైన ప్రమాణాలు పాటించకపోవడంపై మరోసారి చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే, బెంగళూర్-హైదరాబాద్ హైవేపై ఒక వాహనదారుడు తృ‌టిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వాహనం డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ‌కు చెందిన బస్సు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ వీడియో రికార్డ్ అయింది. వేగం వస్తున్న ప్రైవేట్ బస్సు, తనను ఈ ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టిందని వాహనదారుడు ఆరోపించాడు.

Read Also: PIA UK Flights: ఐదేళ్ల నిషేధం తర్వాత.. UKకి విమానాలను తిరిగి ప్రారంభించిన పాకిస్తాన్..

‘‘నిన్న తెల్లవారుజామున 4:30 గంటలకు, బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్లే ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్లక్ష్యంగా నడపడం వల్ల నేను తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాను. అదృష్టవశాత్తూ, నేను భయపడలేదు. ఒక తప్పు మలుపు మా ప్రాణాలను బలిగొనేది’’ అని ఆయన ఎక్స్‌లో తన అనుభవాన్ని రాశారు. ‘‘ప్రైవేట్ ట్రావెల్ బస్సులను నిర్లక్ష్యంగా నడపడం వల్ల హైవేలపై అనేక మంది ప్రాణాలను బలిగొన్న ప్రమాదాలకు ఒక ఉదాహరణ మాత్రమే’’ అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. కొందరు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారని చెబుతుంటే, మరికొందరు వాహనదారుడి నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పారు. బస్సుకు కనీసం 250 మీటర్ల దూరం పాటించలేదని నిందించారు.