Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్

  • బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి
  • 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి
  • మోడీపై మమత ఫైర్
Mamatabanerjee

Mamatabanerjee

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి-మార్చి మధ్యలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియాలి. కానీ బీహార్ కంటే బెంగాల్‌లోనే ఎక్కువగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ బెంగాల్‌లో పర్యటించి మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Achuthanandan: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత

తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలపై మమత స్పందించారు. బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి అని ప్రశ్నించారు. 11 ఏళ్ల దేశాన్ని పాలించిన మోడీ.. ఏం అభివృద్ధి చేశారని బెంగాల్‌లో రాజకీయ మార్పు కావాలని నిలదీశారు. మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని.. అలాంటి మోడీ తమకు ఉపన్యాసాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి అమెరికా నుంచి బహిష్కస్తున్నప్పుడు మోడీ, బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. పీవోకేను స్వాధీనం చేసుకోలేకపోయారు.. కానీ బెంగాల్ గురించి మాత్రం మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంగాలీ భాషపై, బెంగాలీయులపై చేస్తున్న దాడులకు నిరసనగా జూలై 27 వరకు బెంగాల్ అంతటా ర్యాలీలు, కవాతులు నిర్వహిస్తామని మమత చెప్పారు.

 

బెంగాల్‌లో కంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలు ఎలాంటి దారుణాలు ఎదుర్కొంటున్నారో దేశానికి తెలుసన్నారు. కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ అయితే.. బీజేపీది సూపర్ ఎమర్జెన్సీ అని వ్యా్ఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీయులను ఇబ్బంది పెడితే.. సంఘీభావంగా నిరసనల్లో పాల్గొనాలని ప్రజలకు మమత పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తోందని ఆరోపించారు. బీహాల్‌లో చేపట్టినట్లుగానే బెంగాల్‌లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని కుట్ర చేస్తోందని తెలిపారు. బీహార్‌లో 40 లక్షల ఓట్లు తొలగించారని.. బెంగాల్‌లో కూడా అలానే చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించబోమని మమత తేల్చి చెప్పారు. 2026 ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచి.. ఢిల్లీలో బీజేపీని పీఠం దించేందుకు కలిసి రావాలని కోరారు. కోల్‌కతాలో జరిగిన భారీ అమరవీరుల దినోత్సవం (షాహిద్ దివస్) ర్యాలీలో మమత ప్రసంగిస్తూ ఈ వ్యా్ఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!