NTV Telugu Site icon

Ajit pawar: అజిత్ పవర్ కీలన ప్రకటన.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడి.. రంగంలోకి కుమారుడు?

Ajitpawar

Ajitpawar

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్టోబర్‌లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి దెబ్బగా దెబ్బగా తలపడబోతున్నాయి. ఇంకోసారి అధికారం కోసం సంకీర్ణ కూటమి ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి వ్యూహం రచిస్తోంది.

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కుమారుడు రంగంలోకి దిగబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన కుమారుడు జయ్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది పార్టీ నిర్ణయమని వెల్లడించారు. తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని పేర్కొన్నారు. జయ్ పవార్‌ను అసెంబ్లీ బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదిలా ఉంటే అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019‌లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు.

ఇక రక్షా బంధన్‌ రోజున ప్రత్యర్థి ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలేతో జరుపుకుంటారా అని అడిగిన ప్రశ్నకు అజిత్ బదులిస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నానని.. తన సోదరీమణులందరినీ ఏదో ఒక ప్రదేశంలో కలుస్తానని చెప్పారు. తానున్నచోటే సుప్రియా ఉంటే కలుస్తానన్నారు. ఇక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. విభేదాల అంశం మీడియా సృష్టించిందన్నారు. ఇద్దరం కలిసి విజయవంతంగా పని చేస్తున్నామని తెలిపారు. లడ్కీ బహిన్ పథకం కింద మొదటి విడత 35 లక్షల మంది మహిళలకు రూ. 1,500 ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్రంలోని మహిళలు సంతోషంగా ఉన్నారని అజిత్ పవార్ చెప్పారు. ఇక బారామతి లోక్‌సభ స్థానంలో సుప్రియా సూలేపై తన భార్య సునేత్రను పోటీకి దింపడం పొరపాటు అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అజిత్ పవార్ పోటీ చేయడం లేదని.. ఆయన చెప్పలేదని మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్ సునీల్ తట్కరే పేర్కొన్నారు.