Ram Temple donation theft: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను బుధవారం(జూలై15)న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ విరాళాల చోరీని దర్యాప్తు చేసింది. సిట్కు ఇచ్చిన అదనపు 15 రోజుల గడువు జూలై 15తో ముగియనుంది. దీంతో ఈ నివేదికను యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) సంజయ్ ప్రసాద్కు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దర్యాప్తులో మరిన్ని అంశాలను పూర్తి చేసేందుకు సిట్ మరింత సమయం కోరుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, పత్రాలు, సాక్షులు, నిందితుల వాంగ్మూలాన్ని సిట్ పరిశీలించింది. ఈ నివేదికలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులనే కాకుండా, పరిపాలనా లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలు, బాధ్యులైన అధికారుల్ని గుర్తించే అవకాశం ఉంది. విరాళాల సేకరణ, భద్రపరిచే విధానం, నగదు లెక్కింపు, బ్యాంకులో జమ, ఆడిట్, పర్యవేక్ష వ్యవస్థల్లో సంస్కరణలను సూచించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ కేసులో అక్రమంగా మళ్లించిన నిధుల ఆనవాళ్లు గుర్తించేందుకు అయోధ్య పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్మెంట్ సహాయం కోరారు. ఇప్పటివరకు అరెస్టయిన 8 మంది నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 50 బ్యాంక్ ఖాతా లావాదేవీలను 2022 నుంచి పరిశీలిస్తారు. దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధుల్ని బంధువుల ఖాతాల ద్వారా బదిలీ చేశారా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడుటు పెట్టారా? స్థిరాస్తులు కొనుగోలు చేశారా? ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉంటే వారి అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

