NTV Telugu Site icon

RSS: ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్ హింస.. ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు..

Nagpur Violence

Nagpur Violence

RSS: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాద మహారాష్ట్రలో ఉద్రిక్తతలకు కారణమైంది. సోమవారం రోజు నాగ్‌పూర్‌లో నమాజ్ పూర్తైన తర్వాత అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. మరో వర్గం ఇళ్లు, ఆస్తులు, వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహిమ్ ఖాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘర్షణలో 30 మంది కన్నా ఎక్కువ మంది పోలీసులు గాయపడ్డారు.

Read Also: Manoj : ‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. మోహన్ బాబుపై మనోజ్ ట్వీట్

ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఔరంగజేబు సమాధి నేటి తరానికి సంబంధించినది కాదని, ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సునీల్ అంబేకర్ అన్నారు. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన ‘‘ఛావా’’ సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా ఔరంగబేబు, శంభాజీని చంపిన విధానంపై మరాఠా ప్రజలు కన్నీరు పెట్టారు. ఆ తర్వాత నుంచి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

నాగ్‌పూర్‌లో ఈ డిమాండ్‌తో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆందోళన నిర్వహించాయి. అయితే, ఈ ఆందోళనల్లో పవిత్ర వ్యాఖ్యలు ఉన్న వస్త్రాన్ని దహనం చేశారనే పుకార్లు రావడం ఇరు వర్గాల హింసకు కారణమైంది. అల్లరి మూకలు మహల్, హంసపురి ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ఈ హింస ముందస్తు కుట్రగా ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.