Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..

  • అతిక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి.
  • జైలులో ఉన్న అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం.
Up News

Up News

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్‌తో పాటు మరో నలుగురు హ్యుందాయ్ క్రేటా వాహనంలో ప్రయాణిస్తుండగా, ఝాన్సీ సమీపంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది, కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో అబాన్‌తో పాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వీరంతా ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీ వెళ్తున్నారు. జిల్లా జైలులో ఉన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. అలీ అహ్మద్ 2025 అక్టోబర్ 1న నైనీ సెంట్రల్ జైలు నుంచి ఝాన్సీ జిల్లా జైలుకు తరలించారు. అలీ అహ్మద్‌పై అక్రమ వసూళ్ల కేసుతో పాటు 2023లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను జైలు నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న సమయంలో అతడితో పాటు అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను జర్నలిస్టుల ముసుగులో వచ్చిన వ్యక్తులు కాల్చి చంపారు.