అసోంలో భారీ ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. ఒకేసారి పెద్ద గుంపు రైల్వే పట్టాలపైకి వచ్చేశాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై రైల్వే శాఖను అలర్ట్ చేశారు. దీంతో గజరాజులు రైల్వే పట్టాలను దాటుతుండగా ఢిల్లీ-డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ప్రెస్ను కొద్దిసేపు నిలిపివేశారు. దాదాపు 90 ఏనుగులు.. అందులో ఎక్కువగా పిల్ల ఏనుగులు ఉండటంతో.. వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలును ఆపి.. అవి సురక్షితంగా పట్టాలు దాటేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బుధవారం తెల్లవారుజామున అసోంలోని హోజాయ్ జిల్లాలో హబాయ్పూర్ రైల్వే స్టేషన్కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. డిబ్రూగఢ్ నుంచి గువాహటి వైపు వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ ఆ సమయంలో రైల్వే ట్రాక్పై ప్రయాణిస్తోంది. అదే సమయంలో సుమారు 90 ఏనుగులతో కూడిన గుంపు పట్టాలు దాటేందుకు వచ్చింది. తెల్లవారుజామున 4.30 నుంచి 5 గంటల మధ్య హబాయ్పూర్ స్టేషన్ సమీపంలో ఏనుగుల గుంపును అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రాజధాని ఎక్స్ప్రెస్ వస్తున్న విషయం తెలియడంతో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏనుగులను సురక్షితంగా పట్టాలు దాటించేందుకు అటవీశాఖ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయారు. ఫారెస్టర్-1 శశాంక రాయ్ నేతృత్వంలోని బృందం రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి రాజధాని ఎక్స్ప్రెస్ను నిలిపివేసింది. మరో బృందం సుమారు 100 మీటర్ల దూరంలో ఉండి గువాహటి వైపు నుంచి మరో రైలు రాకుండా పర్యవేక్షించింది. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారానికి రైల్వే సిబ్బంది పూర్తిగా సహకరించారని అధికారులు తెలిపారు. దీంతో ఏనుగుల గుంపు ఎలాంటి ప్రమాదం లేకుండా రైల్వే పట్టాలను దాటింది.
ఏడాదిలో రెండుసార్లు వలస
అటవీశాఖ అధికారుల ప్రకారం.. ఈ ఏనుగుల గుంపు ఏడాదిలో రెండుసార్లు ఈ ప్రాంతంలో వలస వెళ్తుంది. ఆగస్టు-సెప్టెంబర్లో ఒకసారి, జనవరిలో మరోసారి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెస్ట్ కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతానికి ఏనుగులు వెళ్తుంటాయి. అక్కడి పంట పొలాల్లో చెరుకు కోసం ఇవి తరచూ సంచరిస్తాయని అధికారులు తెలిపారు. తిరిగి తెల్లవారుజామున లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్కు చేరుకునే సమయంలో రైల్వే పట్టాలను దాటుతాయి. లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు 15 ఏనుగులు శాశ్వతంగా నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకల సమయాలపై అవగాహన ఉన్న ఈ ఏనుగులు సాధారణంగా రైళ్లు లేని సమయంలోనే పట్టాలు దాటుతాయని చెప్పారు.
ప్రమాదం తప్పింది
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీశాఖ సిబ్బంది ముందస్తు హెచ్చరికలు, రైల్వే ట్రాక్లపై ఏర్పాటు చేసిన ఇన్ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS) సంకేతాలు, ఏనుగుల కారిడార్లో అమలు చేస్తున్న వేగ పరిమితులు కలిసి పనిచేయడంతో రాజధాని ఎక్స్ప్రెస్ను సకాలంలో నిలిపివేయగలిగారు. ఇదే నెలలో ఇలాంటి ఘటనలు మరో రెండు చోట్ల కూడా జరిగాయి. ఆగస్టు 15న గువాహటి-మరియాని ఎక్స్ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లంసాఖాంగ్-పాథర్ఖోలా ప్రాంతంలో ఏనుగుల గుంపు సురక్షితంగా పట్టాలు దాటింది. మరుసటి రోజు నరంగి-అగర్తలా ఎక్స్ప్రెస్ సిబ్బంది కూడా హబాయ్పూర్-లంసాఖాంగ్ మార్గంలో ఏనుగులను సురక్షితంగా దాటించారు.
ఏనుగుల రక్షణకు AI టెక్నాలజీ
ఏనుగు-రైలు ప్రమాదాలను నివారించేందుకు NFR పలు చర్యలు చేపడుతోంది. ప్రమాదకర ప్రాంతాల్లో AI ఆధారిత ఇన్ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ.. రైల్వే పట్టాల సమీపంలో ఏనుగుల కదలికలను గుర్తించి రియల్టైమ్లో హెచ్చరికలు అందిస్తుంది. అదనంగా ఏనుగుల సంచారం గుర్తించినప్పుడు రాత్రి వేళల్లో తాత్కాలికంగా రైళ్ల వేగాన్ని తగ్గించడం, పెట్రోలింగ్ పెంచడం, రైలు సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పట్టాల పక్కన వృక్షసంపదను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఏనుగులను రైల్వే ట్రాక్లకు దూరంగా ఉంచేందుకు కొన్ని ప్రాంతాల్లో ‘ప్లాన్ బీ’ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తేనెటీగల శబ్దాలను పెద్దగా వినిపించడం ద్వారా ఏనుగులను దూరంగా పంపించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే ఏనుగుల రాకపోకలకు అనువుగా గుర్తించిన ప్రాంతాల్లో అండర్పాస్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు.
Never see a herd of wild elephants this huge… The Rajdhani lets the Jumbos pass 👍 pic.twitter.com/HOHPgeNVkv
— Vivek Kumar (@VivekKu1604) August 19, 2026

