Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ బిల్లు కాపీలు చించేసిన అసదుద్దీన్ ఒవైసీ

  • లోక్‌సభలో వక్ఫ్ బిల్లు కాపీలు చించేసిన అసదుద్దీన్ ఒవైసీ
  • మహాత్మా గాంధీ ప్రస్తావన గుర్తుకు తెచ్చిన ఒవైసీ
  • 282 ఓట్లతో వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Owaisi

Owaisi

వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.

దేశంలో బీజేపీ విభజన సృష్టించాలని కోరుకుంటోందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలు, మసీదుల పేరుతో విభజనను సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు. బిల్లులో 10 సవరణలు ఆమోదించాలని కోరారు. కేవలం ముస్లింలను అవమానించడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని.. దయచేసి అలా చేయొద్దని ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ప్రస్తావన గుర్తుకు తెచ్చారు. దక్షిణాఫ్రికా చట్టాల గురించి మహ్మాత్మా గాంధీ మాట్లాడుతూ.. ‘నా మనస్సాక్షి దీన్ని అంగీకరించదు’ అని అన్నారని.. ఆ కాపీలను చింపేశారని చెప్పారు. ‘‘గాంధీలాగే. నేను కూడా ఈ చట్టాన్ని చింపివేస్తున్నాను. ఇది రాజ్యాంగ విరుద్ధం. దేవాలయాలు మరియు మసీదుల పేరుతో ఈ దేశంలో విభజనను సృష్టించాలని బీజేపీ కోరుకుంటోంది. నేను దీనిని ఖండిస్తున్నాను. 10 సవరణలను ఆమోదించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని ఒవైసీ అన్నారు.

ఇది కూడా చదవండి: The Paradise : డబ్బులు లేక ‘ప్యారడైజ్’ కు బ్రేక్.. రూమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ పడడంతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఇక గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. ఇక్కడ కూడా దాదాపు 8 గంటల పాటు చర్చ జరగనుంది.