Himanta Biswa Sarma: ‘‘మీ భార్యా పిల్లలు భారతీయులేనా?’’.. కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్ లింకులపై సీఎం సంచలనం..

  • మీ భార్య పిల్లలు భారతీయులేనా..?
  • కాంగ్రెస్ ఎంపీ భార్యకు పాకిస్తాన్ లింకులు..
  • ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై సీఎం హిమంత సంచలన పోస్ట్..
Sarma,gogoi, Elizabeth Colburn

Sarma,gogoi, Elizabeth Colburn

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మీరు 15 రోజులు పాకిస్తాన్‌లో బస చేశారా..? మీ భార్య పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం పొందుతుందా..?’’ అని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా గొగోయ్‌కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ భార్య, వారి పిల్లల పౌరసత్వ స్థితిని కూడా ఆయన ప్రశ్నించారు.

సోషల్ మీడియా పోస్టులో సీఎం ఎంపీ పేరును ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఇది కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్‌‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తోంది. గతంలో చాలాసార్లు గొగోయ్‌కి ఆయన భార్యకు పాకిస్తాన్‌తో సంబంధం ఉందని ఆరోపించారు.

Read Also: Karnataka Minister: ‘‘ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’.. పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ మంత్రి కామెంట్స్..

ఎంపీ భార్య ‘‘ భారతదేశంలో నివసిస్తూ పాకిస్తాన్‌కి చెందిన ఒక ఎన్జీవో నుంచి జీతం తీసుకుంటోంది’’ అనేది నిజామేనా అని సీఎం హిమంత ప్రశ్నించారు. ‘‘అలా అయితే, పాకిస్తాన్‌కి చెందిన ఒక సంస్థ భారతదేశంలో నిర్వహించే కార్యకలాపాలకు జీతం ఎందుకు చెల్లిస్తుందో మేము అడగవచ్చా..?’’ అని హిమంత ప్రశ్నించారు. ఎంపీ భార్య, పిల్లల పౌరసత్వం ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ వారు భారతీయ పౌరులా లేదా వారు ఇతర దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారా..? ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి’’ అని హిమంత ట్వీట్ చేశారు.

గత నెలలో, గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌కి పాకిస్తాన్తో సంబంధాలున్నట్లు హిమంత ఆరోపించారు. పాకిస్తాన్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌పోల్ వంటి సంస్థల సహాయం కోరవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..బీజేపీకి లేవనెత్తడానికి ఎలాంటి సమస్యలు లేవని, కాబట్టి నిరాధారమైన ఆరోపనలు చేస్తోందని ఆరోపించారు.