Apple’s First Store In India: ఇండియాలో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్..

Apple Store

Apple Store

Apple’s First Store In India: టెక్ దిగ్గజం యాపిల్ తన మొదటి యాపిల్ స్టోర్ ను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా స్టోర్ ప్రారంభం అయింది. భారతదేశంలో యాపిల్‌కి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టోర్‌ను ప్రారంభించబడింది. టిమ్ కుక్ దగ్గరుండి మరీ కస్టమర్లను స్వాగతించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ను ప్రారంభించిన సందర్బంగా ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. చాలా మంది కస్టమర్లు మంగళవారం ఉదయం నుంచే యాపిప్ స్టోర్ ముందు గుమిగూడారు. చాలా మంది యాపిల్ లవర్స్ సెల్ఫీలు దిగారు.

Read Also: NIA: భారత హైకమిషన్‌‌పై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి.. ఎన్ఐఏ విచారణ

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను చూసేందుకు భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముంబై వచ్చారు. యాపిల్ విస్తరణలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో రెండో యాపిల్ స్టోర్ ప్రారంభం కానుంది. యాపిల్ ప్రోడక్ట్స్ తయారీకి భారతదేశాన్ని స్థావరంగా మార్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఐఫోన్లతో సహా దాని ఉత్పత్తుల్లో కొన్ని తైవాన్ కు చెందిన కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఫాక్స్‌కాన్ మరియు విస్ట్రాన్ కార్ప్ ద్వారా దేశంలో అసెంబుల్ చేయబడుతున్నాయి.

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పలువురు సెలబ్రెటీలతో ఉత్సాహంగా గడిపారు. మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో టిమ్ కుక్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. మౌనీరాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బోనీకపూర్ కూడా స్టోర్ ప్రారంభం గురించి ఉత్సాహంగా తన అభిమానులతో పంచుకున్నారు. నేహా ధూపియా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. మాధురీ దీక్షిత్, టిమ్ కుక్ వడాపావ్ తింటున్న ఫోటోలను షేర్ చేసింది.