CM Yogi: “బుజ్జగింపు రాజకీయ నాయకుల” పవిత్ర స్నానాలు.. అఖిలేష్‌పై విమర్శలు..

  • కుంభమేళాలో అఖిలేష్ యాదవ్ స్నానం..
  • బుజ్జగింపు రాజకీయ నేతల స్నానం అంటూ యోగి సెటైర్లు..
Yogi Adityanath Akhilesh Yadav

Yogi Adityanath Akhilesh Yadav

CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు.

Read Also: Rahul Gandhi: ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్‌మహల్.. కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు

సనాతనాన్ని నమ్మని, కేవలం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే వారు బలవంతంగా స్నానం చేయవలసి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆదివారం అఖిలేష్ యాదవ్ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని సంగమ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అఖిలేష్ యాదవ్ పుణ్యస్నానం చేసిన తర్వాత తన తండ్రి విగ్రహానికి పూలమాల వేశారు. దీనిపై యోగి మాట్లాడుతూ.. కొందరు మహాకుంభ్ ప్రాముఖ్యతను గుర్తించి ప్రముఖల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని, మనం ఈ విశ్వాసాలను విస్మరిస్తే, విశ్వాసాలు మనల్ని విస్మరిస్తాయని యోగి అన్నారు.

ప్రతిపక్షాల భాగస్వామ్యం సనాతన ధర్మ విజయాన్ని సూచిస్తుందా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై యోగి మాట్లాడుతూ.. ఇది విజయం లేదా ఓటమి గురించి కాదని, ఇది సనాతన ధర్మం యొక్క శాశ్వత శక్తి, ప్రభావాలకు నిదర్శనమని, భారతదేశ విశ్వాసానాలను ఎప్పుడూ గౌరవించని వారు కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అని అన్నారు. గత 15 రోజుల్లో 16 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని చెప్పారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళకి 45 కోట్ల మంది వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.