Akhilesh Yadav: పార్లమెంట్లో మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాన్ను తొలగించి ప్రధాన మంత్రిని కాపాడారు’’ అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్ను బలిపశువు చేసినట్లు ఆరోపించారు. విద్యార్థి ఉద్యమం ప్రభుత్వం మెడలు వచ్చిందని అన్నారు. రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్కు వచ్చినప్పుడు బీజేపీ ఎంపీలు ఘనంగా స్వాగతించాయని, ఆయన తొలగింపు ఎంత పెద్ద సంక్షోభం నుంచి బయపడేసిందో ఊహించండి అని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని తల వంచేలా చేసిన యువత ధైర్యసాహసాలను అఖిలేష్ ప్రశంసించారు. ‘‘ప్రపంచం వంగుతుంది, దానిని వంచే వ్యక్తి ఉండాలి. ప్రభుత్వం ఎప్పటికీ తలవందననుకుంది, కానీ యువత ఐక్యత ముందు ప్రభుత్వం వెనక్కి తగ్గి మంత్రితో రాజీనామా చేయించింది’’ అని అన్నారు. తల్లిదండ్రుల మద్దతు పొందిన తొలి విద్యార్థి ఉద్యమం ఇదే అని ఆయన అన్నారు. ప్రభుత్వం భయపడినప్పుడే డిమాండ్లను అంగీకరిస్తుందని, రైతుల ఉద్యమ సమయంలో ఎన్నికలు సమీపించడంతో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు.
బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ, యూనివర్సిటీలనను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. విద్యావ్యవస్థకు ఒకే రంగు వేయాలని బీజేపీ ప్రయత్నించిందని, అందుకే విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగిందని, భారీ ఉద్యమంగా మారిందని, చివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అన్నారు. దళితులు, వెనకబడిన వర్గాల ఉద్యోగ హక్కుల్ని ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.

