Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు(బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై నుంచి బారామతి బయలుదేరిన ఆయన, ఫ్లైట్ మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ అవుతుందనే సమయంలో క్రాష్ ల్యాండ్కు గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా మొత్తం ఐదుగురు మరణించారు. అయితే, అజిత్ పవార్ చివరి క్షణాల్లో విమానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు ఏం జరిగింది.?
ఉదయం 8.10 గంటలకు ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన, VT-SSKగా నమోదైన లియర్జెట్ 45 విమానం ముంబై ననుంచి బారామతి బయలుదేరింది. ఉదయం 8.18 గంటలకు బారామతి విమానాశ్రయంతో విమానం కాంటాక్ట్ అయింది. ముంబై నుంచి బారామతికి 256 కి.మీ, సుమారు 45 నిమిషాల ప్రయాణం. విమానం బారామతికి 30 నాటికల్ మైళ్ల దూరం(55.6 కి.మీ) దూరంలో ఉండగా, పూణే ఏటీసీ నుంచి బారామతికి కంట్రోల్ అప్పటించారు. పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్కు వాతావరణ పరిస్థితుల్ని తెలియజేశారు. ఆమె ఇష్టానుసారం ల్యాండ్ చేయాలని సూచించారు.
పైలట్ పాఠక్ విమానాశ్రయ సమీపంలో గాలి వేగం, విజిబిలిటీ గురించి అడిగారు. సాధారణంగా పైలట్లు ల్యాండింగ్ సమయంలో గ్రౌండ్ స్టాఫ్/ఏటీసీతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ప్రభుత్వ ప్రకటనలో తెలియజేసింది. ఆమెకు దాదాపు 3000 మీటర్లు/3 కి.మీ ఉందని చెప్పారు. ఇది సాధారణంగా ల్యాండింగ్కు సరిపోయే పరిమితి.
ల్యాండింగ్ కోసం విఫలయత్నం..
విమానం కూలిపోయిన సమయంలో బారామతి ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ ఉన్నాయని ప్రాథమిక సమాచారం. ల్యాండింగ్కు అనుమతి వచ్చిన తర్వాత పైటల్ ఆ అనుమతిని తిరిగి నిర్ధారించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా పైలట్లు పాటించే స్టాండర్డ్ ప్రోటోకాల్. కానీ అజిత్ పవార్ ప్రయాణించే VT-SSK విమాన పైలట్లు అలా చేయలేదు. కొన్ని క్షణాల్లో రన్వేకు సమీపంలో పెద్ద శబ్ధంతో కూలిపోయి, మంటలు చెలరేగాయి.
విమానం రన్వే11పై దిగేందుకు అనుమతి వచ్చింది. అయితే, ‘‘రన్ వే కనిపించడం లేదు’’ అని పైలట్ల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మరోసారి గో -అ రౌండ్( మళ్లీ ఫ్లైట్ లేకాఫ్ చేసి, తిరిగి ల్యాండింగ్కు ప్రయత్నించడం) చేయాలని సూచించారు. గో-అరౌండ్ తర్వాత విమానం దాని స్థానాన్ని తెలియజేసింది. రన్వే కనిసిస్తుందా అని అడగగా, కనిపిస్తోందని నిర్ధారణ ఇచ్చారు. ఉదయం 8.34కు విమానానికి ల్యాండింగ్ అనుమతి వచ్చింది. అయితే, ఇక్కడే కీలక లోపం జరిగినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ అనుమతిని పైలట్ తిరిగి చదివి నిర్ధారించలేదు
ఉదయం 8.43 విమానం సిగ్నల్స్ పంపించడం నిలిపేసింది. ADS-B సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఈ వ్యవస్థ విమానం ఎత్తు, వేగం, దాని స్థానం లాంటి వివరాలను పింపిస్తుంది. ఉదయం 8.46 గంటలకు బారామతి విమానాశ్రయ సమీపంలోని హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో భారీ పేలుడు, అగ్ని ప్రమాదం కనిపించింది. విమాన రన్వేకు సుమారు 100 అడుగుల ముందే విమానం కూలిపోయింది.
ప్రభుత్వ ప్రకటన:
బారామతి విమానాశ్రయ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా ఐదుగురు అంతా మరణించారు. బారామతి విమానాశ్రయం ఒక అన్కంట్రోల్డ్ ఎయిర్ ఫీల్డ్ అని ప్రభుత్వం తెలిపింది. అక్కడ పూర్తి స్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లేకపోవడం వల్ల, విమాన రాకపోకల్ని స్థానిక ఫ్లయింగ్ స్కూల్కు చెందిన పైలట్లు, సిబ్బంది నిర్వహిస్తారు. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించింది.
