Airtel: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్‌టెల్ సర్వీసులు

దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్‌టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌టెల్ సేవలు ఆగిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి అంటూ పలువురు కస్టమర్లు మండిపడుతున్నారు.

మరోవైపు టారిఫ్‌ రేట్లను మరోసారి భారీగా పెంచేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమవుతోంది. మూడు లేదా నాలుగు నెలల్లో గానీ.. లేదా ఈ ఏడాదిలో ఎప్పుడైనా మొబైల్‌ టారిఫ్ ధరల పెంపు ఉండవచ్చునని ఆ సంస్థ మేనేజ్‌మెంట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. 2022 ఏడాదిలో ఒక యూజర్‌ సగటు రాబడి రూ.200గా ఉండాలని ఎయిర్‌టెల్ కంపెనీ భావిస్తోంది.