Air India: దేశీయ దిగ్గజ ఎయిర్ లైనర్ ‘ఎయిరిండియా’ పదేపదే అభాసుపాలవుతోంది. గత కొన్ని నెలలులగా ఎయిరిండియా వివాదాల్లో నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఎయిరిండియా పైలట్లు ఒక మహిళ స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించారు. ప్రయాణం మొత్తం కూడా ఆమె కాక్పిట్లోనే ఉంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిరిండియాను వివరణ అడిగింది. కాక్పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలట్లను సస్పెండ్ చేసింది.
Read Also: Bank Jobs: బ్యాంకులో కొలువుల జాతర.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు..
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. గత వారం ఢిల్లీ-లేహ్ విమానం AI-445 కాక్పిట్లోకి ఒక మహిళను పైలట్లు అనుమతించారు. ప్రస్తుతం పైలట్లపై క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా చర్యలు ప్రారంభించింది. విమానం కాక్పిట్లోకి మహిళను అనుమతించినందుకు ఇద్దరు పైలట్లను గ్రౌండ్/ఆఫ్-రోస్టర్ చేసినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. డీజీసీఏకి ఈ విషయం తెలుసునని, విధివిధానాలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొన్ని నెలల క్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్-ఢిల్లీ విమానంలో కాక్పిట్లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించిన పైలట్లపై డీజీసీఏ నిబంధలనకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మహిళా స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్పిట్ ఉల్లంఘన కేసులో సత్వర, సమర్థవంతమైన చర్యను ప్రారంభించడంలో వైఫల్యం చెందిందనే ఆరోపణలతో విమానయాన నియంత్రణ సంస్థ విమానయాన సంస్థపై రూ.30 లక్షల జరిమానా విధించింది.
