Air India: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంధన స్విచ్లలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో దానిని గ్రౌండ్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎడమ ఇంజన్కు సంబంధించిన ఇంధన స్విచ్ ‘‘రన్’’ పొజిషన్లో నిలువకుండా రెండుసలార్ ‘‘కట్ ఆఫ్’’కి మారిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
AI 132 ఫ్లైట్ లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి బెంగళూర్ రావాల్సి ఉంది. పైలట్ లేవనెత్తిన సమస్యను అవ్యవసర ప్రాతిపదికన పరిశీలిస్తు్న్నామని ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ అంశాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తెలియజేశారు. ఇంతకుముందు, డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్లో ఉన్న అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో లోపాలు లేవని సంస్థ వెల్లడించింది.
జూలై 2025లో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ప్రమాదం తర్వాత ప్రాథమిక నివేదికలో టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లో ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు తాత్కాలికంగా ఆఫ్ చేయబడినట్లు, దీంతోనే ఇంజన్లకు అందాల్సిన శక్తి తగ్గిందని వెల్లడైంది. ఫలితంగా టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు.
ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు:
ఇంధన నియంత్రన స్విచ్లు విమాన ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ లేదా షట్డౌన్ చేయడానికి పనిచేస్తాయి. విమానంలో ఇంజన్ లోపం తలెత్తినప్పుడు మాన్యువల్గా ఆపడానికి లేదా మళ్లీ స్టార్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.
బోయింగ్ 787లోని రెండు ఫ్యూయల్ స్విచ్లు థ్రస్ట్ లివర్ కింద ఉంటాయి. రన్ నుంచి కట్ ఆఫ్కు మార్చాలంటే పైలట్ ముందుగా స్విచ్ను పైకి లాగి, ఆ తర్వాత దాని స్థానాన్ని మార్చాలి. అహ్మదాబాద్ ప్రమాదంలో టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్ స్విచ్లు ఒక సెకన్ వ్యవధిలో వరసగా రన్ నుంచి కట్ఆఫ్గా మారినట్లు ఫ్లైట్ రికార్డర్ వెల్లడించింది. కాక్పిట్లో ఒక పైలట్ ‘‘నువ్వు ప్యూయల్ ఎందుకు కట్ చేశావు..?’’ అని అడగగా, మరొకరు ‘‘నేను చేయలేదు’’ అని సమాధానం ఇచ్చారు.