Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్

  • ఎయిరిండియా కొత్త సీఈవోగా గెబ్రెమరియమ్ బాధ్యతలు
  • గెబ్రెమరియమ్ ముందు సవాలు
  • కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
Airindia

Airindia

ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా టెవోల్డే గెబ్రెమరియమ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన సీఈవో ముందు భారీ సవాల్ ఉంది. గతంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ను దశాబ్దానికి పైగా నడిపిన ఆయన.. ఇప్పుడు నష్టాలు, నగదు కొరత, భారీ పెట్టుబడులతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టాల్సి ఉంది. సంస్థ పునరుద్ధరణకు మరోసారి భారీగా నిధులు అవసరం కావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.

క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన గెబ్రెమరియమ్‌కు ఎయిర్ ఇండియా పరివర్తన, కార్యకలాపాల నిర్వహణ, భద్రత, లాభదాయకమైన విస్తరణలో అనుభవం ఉందని సంస్థ పేర్కొంది. అయితే భారత్‌లో ఆయన ముందున్న పరిస్థితి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే మరింత సంక్లిష్టమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు.

నాలుగేళ్ల తర్వాత కూడా భారీ పెట్టుబడులు

టాటా గ్రూప్ 2022 జనవరిలో ఎయిర్ ఇండియాపై మళ్లీ నియంత్రణ సాధించిన తర్వాత నాలుగేళ్లు గడిచాయి. అయినప్పటికీ సంస్థ పరివర్తనకు అవసరమైన ఆర్థిక భారం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. ఎయిర్ ఇండియా షేర్‌హోల్డర్ల నుంచి సుమారు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,500 కోట్లు) తాజా ఈక్విటీ నిధులుగా సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంస్థ నష్టాలు రెండింతలకు పైగా పెరిగాయి. కార్యకలాపాల నుంచి వచ్చే నగదు ప్రవాహం కూడా ప్రతికూలంగా మారింది. అయితే ఈ నిధులు కేవలం నష్టాలను భర్తీ చేసేందుకు మాత్రమే కాదు. ఎయిర్ ఇండియా తన విమానాల సంఖ్యను పెంచడం, పాత విమానాలను ఆధునీకరించడం, క్యాబిన్లను పునరుద్ధరించడం, టెక్నాలజీ, ఆపరేషనల్ సిస్టమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి అనేక పనులు చేపడుతోంది.

ఎయిర్ ఇండియా త్వరగా లాభాల్లోకి వస్తుందని ఆశించడం సరికాదని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గతంలోనే హెచ్చరించారు. టాటా సన్స్ FY26 వార్షిక నివేదికలో వాటాదారులకు ఇచ్చిన సందేశంలో.. ఎయిర్ ఇండియా పరివర్తనను ఐదు నుంచి పదేళ్ల ప్రయాణంగా చూడాలని పేర్కొన్నారు. “ఎయిర్‌లైన్స్ చరిత్రలో గొప్ప సంస్థలన్నీ కొన్ని త్రైమాసికాల్లో కాకుండా దశాబ్దాల కాలంలో నిర్మితమయ్యాయి” అని చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియా అప్పగించబడినప్పుడు పాత విమానాలు, పాత టెక్నాలజీ వ్యవస్థలు, సేవల పరంగా సమస్యలు, సంస్థాగత మరియు సాంస్కృతిక మార్పుల అవసరం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ దశలవారీగా మార్చాల్సి వస్తోంది.

దేశీయ మార్గాల్లో నడిచే ఎయిర్ ఇండియా న్యారో-బాడీ విమానాల రీఫర్బిష్‌మెంట్ పూర్తయింది. వైడ్-బాడీ విమానాల ఆధునీకరణ కార్యక్రమం మాత్రం FY28 చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో కస్టమర్ సంతృప్తిని కొలిచే నెట్ ప్రమోటర్ స్కోర్ (NPS) కూడా మెరుగుపడినట్లు సంస్థ పేర్కొంది. అయితే విమానాల రీఫర్బిష్‌మెంట్ ఒక్కటే సరిపోదు. విమానాల విశ్వసనీయత, సేవల నాణ్యత, టెక్నాలజీ, నెట్‌వర్క్, శిక్షణ, నిర్వహణ సామర్థ్యాలను కూడా భారీగా మెరుగుపరచాల్సి ఉంది. విమానాలు, విడిభాగాల సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు ఈ ప్రక్రియను మరింత కష్టతరం చేస్తున్నాయి.

అసలు సమస్య ఇదే.. ఒకేసారి భారీ ఖర్చులు

ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన ఆర్థిక సమస్య ఎదురవుతోంది. భవిష్యత్తులో లాభదాయకమైన ఎయిర్‌లైన్‌గా మారేందుకు భారీగా ఖర్చు చేయాలి. కానీ అదే సమయంలో ప్రస్తుత కార్యకలాపాలే నగదును ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ వందలాది కొత్త విమానాలను ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి అందుకోనుంది. పాత విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టడం, దేశీయ-అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించడం దీని లక్ష్యం. కొత్త విమానాలు రావడంతో వాటి కోసం పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీర్లు, నిర్వహణ సదుపాయాలు వంటి వాటిపై కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదనపు విమాన సామర్థ్యాన్ని లాభదాయకంగా వినియోగించేందుకు కొత్త మార్గాలను కూడా అభివృద్ధి చేయాలి. అందువల్ల ఇప్పుడే భారీగా ఖర్చు చేసి.. భవిష్యత్తులో స్థిరమైన లాభాలను సాధించాల్సిన పరిస్థితి ఎయిర్ ఇండియాకు ఏర్పడింది.

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ అనుభవం ఉపయోగపడుతుందా?

కొత్త CEO టీవోల్డే గెబ్రెమరియమ్‌కు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన నాయకత్వంలో ఆ సంస్థ విమానాల సంఖ్య, నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించింది. ఆఫ్రికాలోని అడిస్ అబాబాను కీలక విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు కార్గో, విమాన నిర్వహణ, ఏవియేషన్ శిక్షణ వంటి విభాగాలను కూడా విస్తరించింది. అయితే ఎయిర్ ఇండియాలో ఆయన తక్షణ సవాలు.. టాటా గ్రూప్ యాజమాన్యంలో గత నాలుగేళ్లుగా చేసిన పెట్టుబడులు, సంస్కరణలను స్థిరమైన ఆపరేషనల్, ఆర్థిక పనితీరుగా మార్చడం.

గెబ్రెమరియమ్ ముందు అసలు టాస్క్ ఇదే!

కొత్త CEO ముందున్న లక్ష్యం కేవలం నష్టాలను తగ్గించడం కాదు. భద్రత, విశ్వసనీయతను మెరుగుపరచడంతో పాటు పాత విమానాలను ఆధునీకరించాలి. కొత్త విమానాలను అందిపుచ్చుకోవాలి. సేవలు, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలి. భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, సాంకేతిక సామర్థ్యాలను పెంచాలి. అంటే ఎయిర్ ఇండియా పునరుద్ధరణ ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. టాటా సన్స్ అంచనా వేసినట్లుగా ఇది 5 నుంచి 10 ఏళ్ల ప్రయాణంగా మారితే.. సంస్థకు మాత్రమే కాదు. దాని ప్రధాన వాటాదారులైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు కూడా ఇది భారీ ఖర్చుతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణంగా మారే అవకాశం ఉంది.