Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. బీజేపీ, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే, ఎన్నికల్లో కూడా ఏఐఎంఐఎం పార్టీ కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తీసుకోవాల్సిందే అని ఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ అన్నారు. అఖిలేష్ రాజకీయ వ్యూహం ఓవైసీ లేకుండా పూర్తి కాదని అన్నారు. ఎస్పీ అవలంభిస్తున్న PDA (పిచ్ఛడా, దళిత్, అల్పసంఖ్యాకులు) ఫార్ములాలోని ‘A’ అంటే అసదుద్దీన్ ఒవైసీ కావాలని ఎద్దేవా చేశారు.
అఖిలేష్ యాదవ్ PDAలో అసదుద్దీన్ ఒవైసీకి ‘A’ చోటు దక్కే వరకు ఆయన అధికారంలోకి రావడం కలే అని అన్నారు. ఎస్పీ వెనకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలుపుకుని రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్పై షాదాబ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన బీజేపీని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. మసూద్ వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ బీజేపీతో రాజకీయంగా కలిసిపోయినట్లు అనిపిస్తోందని అన్నారు. అఖిలేష్ యాదవ్ తన సొంత సామాజిక ఓటు బ్యాంకుపై మరింత దృష్టి సారించాలని, ఆయనకు మద్దతుగా ఉన్న కొన్ని వర్గాలు బీజేపీ వైపు వెళ్తున్నాయని హెచ్చరించారు.

