దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో సందడి మొదలైంది. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరణ జరగనుంది. మార్చి 16న పోలింగ్ జరగనుంది.
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా బెంగాల్ నటి కోయల్ మల్లిక్కు అవకాశం దక్కింది. మాజీ డీజీపీ రాజీవ్ కుమార్తో సహా హీరోయిన్ కోయల్ మల్లిక్, బాబుల్ సుప్రియో, న్యాయవాది మేనకా గురుస్వామి పేర్లును టీఎంసీ వెల్లడించింది. వీరి పేర్లను ప్రకటించడానికి పార్టీ సంతోషిస్తోందని ఎక్స్లో పేర్కొంది. వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది. బాబుల్ సుప్రియో 2021లో టీఎంసీలో చేరారు. ప్రస్తుతం మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా మంత్రిని రాజ్యసభకు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది.
