Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

  • బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం
  • రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
  • 106 నుంచి 113కు చేరిన బీజేపీ బలం
Rajya Sabha

Rajya Sabha

బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 106 నుంచి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ ఎంపీల సంఖ్య 3కు పడిపోయింది.

గత శుక్రవారం ఆప్ ఎంపీలు ఊహించని షాకిచ్చారు. ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇక రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కలిశారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు.

ఎంపీల ఫిరాయింపుపై ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏడుగురు ఎంపీలు నిష్క్రమించడం చట్టవిరుద్ధమని ప్రకటించారు. రాఘవ్ చద్దాతో సహా ఆ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాఘవ్ చద్దాను ‘‘ద్రోహి’’ అని పిలుస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా పంజాబ్ ద్రోహులు అంటూ ఎంపీల పోస్టర్లు వేశారు.