బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్‌లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!

రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌.. తాజాగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేయడమే.

Read Also: వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం.. ఆ ఘనత జగన్‌దే..!

భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపిన ఎంపీ భగవంత్‌ మాన్… బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, అంతే కాదు కేంద్ర కేబినెట్‌లో చోటు కూడా కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన భగవంత్‌ మాన్.. బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత.. నాతో మాట్లాడారు… పార్టీలో చేరేందుకు మీకు ఏం కావాలి? డబ్బులేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్‌లో కావల్సిన పోస్టు ఇస్తామని ఆయన తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.. ఇక, సమయం వచ్చినప్పుడు సదరు బీజేపీ నేత పేరును కూడా బయటపెడతానన్న ఆయన.. పంజాబ్‌లోని ఆప్‌ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ ఆయన.. తాను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. కాగా, పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్ని అంతర్గ విభేదాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్.. కొత్త పార్టీ పెట్టి.. బీజేపీతో పొత్తుకు సిద్ధం అయ్యారు. మరోవైపు.. పంజాబ్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే పలు వాగ్ధానాలు చేశారు పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. ఇక, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దీంతో.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.