Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న మరో 11 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.
ఐదు రోజుల పోలీస్ కస్టడీలో, మంగళవారం నాలుగో రోజు కూడా విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. హర్యానా పోలీస్, ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు పలు దఫాలుగా విచారణ జరిపారు. అయితే, జ్యోతి మాత్రం వారికి సహకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. 2023 పాకిస్తాన్ సందర్శనలో ఎవర్ని కలిశారు..? హర్కిరత్ సింగ్ అనే వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడా..? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎహ్సాన్ దార్ అలియాస్ డానిష్తో పరిచయంపై అధికారులు విచారిస్తున్నారు. జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న డానిష్ని ఎప్పుడు కలిశారు.? 2023 వీసా నిరాకరించడానికి ముందు లేదా తర్వాత జరిగిందా..? అని ఆరా తీస్తున్నారు. భారత్ డానిష్ అనే రాయబార కార్యాలయం నుంచి బహిష్కరించిన తర్వాత అతడితో సంబంధాలు కొనసాగించిందా..? అని తెలుసుకోవాలని విచారణ అధికారులు భావిస్తున్నారు. డానిష్ లేదా ఇతర పాక్ వ్యక్తులు వీసా సహాయం, నిధులు, కంటెంట్ ఐడియాలు లేదా ఇంకా ఏదైదా మద్దతు ఇచ్చారా..? లేదా ఏదైనా ప్రభావం ఈమెపై ఉందా అని పరిశీలిస్తున్నారు.
జ్యోతి 2024లో తన వీసాను ఒక నెల ఎందుకు పొడగించింది, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే ఆమె వీడియోలు, మెసేజ్లను ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత భద్రతా దళాలను నిందిస్తూ ఆమె చేసిన వీడియోపై అధికారులు వివరణను కోరుతున్నారు. పాకిస్తాన్లో డానిష్తో పాటు ఆమె ఎవరెవర్ని కలిసింది అనేదానిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె జరిపిన ఎన్క్రిప్టెడ్ చాట్స్ని పరిశీలిస్తున్నారు. చైనా, దుబాయ్, బంగ్లాదేశ్, భూటాన్కు ఆమె ప్రయాణాలు, అందుకు ఎవరైనా ఆర్థిక, లాజిస్టిక్ సహాయం చేశారా.? అని ప్రశ్నిస్తున్నారు.