ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల పాటు శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్లో బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు. అనంతరం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు.
అసలేం జరిగిందంటే..: మల్కరోడా డెవలప్మెంట్ బ్లాక్లోని పిహరీద్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల రాహుల్ సాహు బధిరుడు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఆడుకుంటూ.. వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన జాంజ్గీర్ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిహరీద్ గ్రామంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు . వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. మరోవైపు, ముఖ్యమంత్రి బఘేల్.. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.