తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నాయి పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళ సినిమా విపరీతంగా నచ్చేయడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ దీనికి సంభాషణలు రాశారని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలోనే సినిమాను జనం ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు. తమిళ మాతృకకు పనిచేసిన ప్రధాన సాంకేతిక నిపుణులే తెలుగు రీమేక్ కూ వర్క్ చేస్తున్నారు. సంగీతాన్ని లియోన్ జేమ్స్ సమకూర్చుతుండగా, విధూ అయ్యన్న సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు. అయితే ఎడిటర్ గా మాత్రం నిర్మాతలు గ్యారీ బిహెచ్ ను ఎంపిక చేసుకున్నారు.