సోషల్ మీడియాలో వచ్చే పాపులారిటీని, సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని కొందరు కేటుగాళ్లు సాగిస్తున్న దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా యూట్యూబ్లో ఫేమస్ అయి, ‘మన శంకర వర ప్రసాద్’లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కనే నటించిన రమా నందన (నందు) కుటుంబం చుట్టూ ఇప్పడు చట్టం ఉచ్చు బిగుసుకుంది. విదేశాల్లో ఉన్న ఉన్నత అవకాశాలను ఆసరాగా చేసుకుని, వీసా రెన్యూవల్ పేరిట ఒక ఏకంగా 15 లక్షల రూపాయలు నామం పెట్టిన వ్యవహారంలో ఈమెపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ మోసం గురించిన వివరాలు బయటపడ్డాయి.
వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో లండన్ (UK) లో ఉండేవాడు. అక్కడ అతని వీసా గడువు ముగిసే సమయం దగ్గరపడటంతో, దాన్ని ఎలాగైనా పొడిగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే అతనికి ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. బాధితుడి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన సదరు కన్సల్టెన్సీ యాజమాన్యం.. తమకు లండన్లో పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయని నమ్మబలికారు. ఇండియా బ్రాంచ్లో కనుక డబ్బులు డిపాజిట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా వీసా రెన్యూవల్ ప్రాసెస్ పూర్తి చేసి చేతిలో పెడతామని మాయమాటలు చెప్పారు. సెలబ్రిటీల బ్యాక్గ్రౌండ్ ఉండటం, పైకి పెద్ద కన్సల్టెన్సీ లాగా కలరింగ్ ఇవ్వడంతో శివక్రాంతి కుమార్ వారి మాటలను పూర్తిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతోనే విడతల వారీగా సుమారు రూ.15 లక్షల భారీ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేశాడు.
డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా వీసా ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీనిపై బాధితుడు కన్సల్టెన్సీ నిర్వాహకులను గట్టిగా నిలదీయడంతో వారి అసలు స్వరూపం బయటపడింది. సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎదురు తిరగడం, బెదిరింపులకు దిగడంతో తాను దారుణంగా మోసపోయానని శివక్రాంతి గ్రహించాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పక్కాగా మోసం జరిగినట్లు నిర్ధారించుకున్నాక.. డెస్టినీ కన్సల్టెన్సీపై క్రైమ్ నంబర్ 515/2025 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య అయిన నటి రమానందన (నందు), అలాగే గుంటూరులో ఉంటున్న మధుకర్ తండ్రిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే కేసు వరకు వచ్చినది ఇదొక్కటే అయినా, వీరి మీద చాలా మంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.
