NTV Telugu Site icon

మెగాస్టార్ ‘ఆచార్య’కు పోటీగా సూర్య సినిమా

తమిళ అగ్ర హీరో సూర్య సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో సూర్య మంచి హిట్లు అందుకున్నా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైతే బాగుండేదని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలోనే రాబోతోంది. సూర్య నటించిన తాజా సినిమా ‘ఈటీ’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు భాషల్లో విడుదల కానుంది.

Read Also: ‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘ఈటీ’ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళనాట విలక్షణ దర్శకుడిగా పాండిరాజ్‌కు పేరుంది. గతంలో పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటించాడు కూడా. దీంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ఈటీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రత్నవేలు ఫొటోగ్రఫీ అందిస్తుండగా డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. కాగా సూర్య ‘ఈటీ’ విడుదలవుతున్న రోజే మెగాస్టార్ ‘ఆచార్య’ కూడా విడుదలవుతోంది. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆచార్యకు పోటీగా వస్తున్న ‘ఈటీ’కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కువ సంఖ్యలో దొరకడం కష్టమనే చెప్పాలి.