NTV Telugu Site icon

తండ్రికి తగ్గ తనయుడు

తండ్రి కృష్ణ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ను విశేషణంగా మార్చుకున్నారు. ఇక తనయుడు మహేశ్ బాబు సైతం ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్ ని పరిచయం చేసిన కృష్ణ తనయునిగా మహేశ్ ‘టక్కరిదొంగ’లో కౌబోయ్ గా జనం ముందు నిలిచారు. వైవిధ్యం కోసం కృష్ణ ‘అఖండుడు’లో మాయమై పోయే పాత్రలో నటిస్తే, మహేశ్ ‘నాని’లో బాలుని నుండి ఏకంగా యువకునిగా మారే విలక్షణమైన పాత్రలో కనిపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని మట్టుపెట్టడానికి ‘పగసాధిస్తా’నంటూ కృష్ణ ఆ రోజుల్లో సందడి చేస్తే, ‘నిజం’ నిగ్గు తేలుస్తానంటూ మహేశ్ తన కెరీర్ లో ముందుకు సాగారు. ఇలా పలు విధాల నటనలో తండ్రి కృష్ణను గుర్తు చేస్తూ ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు మహేశ్.

తండ్రిని మించిన తనయుడు

కొన్ని విషయాల్లో తండ్రి కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. కృష్ణ కెరీర్ లో ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు కూడా లభించలేదు. అయితే ‘నిజం’తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్, ఆ తరువాత ‘అతడు, దూకుడు, శ్రీమంతుడు’ చిత్రాల ద్వారా కూడా ఉత్తమ నటునిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కృష్ణ నటజీవితంలో మొత్తం 300పై చిలుకు చిత్రాలలో కేవలం రెండంటే రెండు డైరెక్ట్ జూబ్లీస్ ఉన్నాయి. అవి ఏవంటే ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. అయితే మహేశ్ బాబు కెరీర్ లో నాలుగు చిత్రాలు డైరెక్ట్ గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి ఏవంటే “మురారి, ఒక్కడు, అతడు, పోకిరి”. మరో విశేషమేమంటే ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ‘పోకిరి’ చిత్రం అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

ఆ తరువాత కూడా మహేశ్ కు “దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు” వంటి సూపర్ హిట్స్ దక్కాయి. వీటిలో ‘శ్రీమంతుడు’ కూడా రజతోత్సవం చేసుకుంది.
తండ్రిలాగే మహేశ్ కూడా నిర్మాతగా మారారు. అయితే తండ్రిలాగా అదే పనిగా ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి, ఆ బ్యానర్ పైనే చిత్రాలను నిర్మించకుండా, తనతో సినిమాలు నిర్మించేవారితో భాగస్వామిగా కలసి సినిమాలు తీస్తున్నారు మహేశ్. ఆయన నిర్మాణ భాగస్వామిగా ‘ఎమ్.బి.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మితమైన తొలిచిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా మంచి విజయాన్ని చూసింది. ఆ తరువాత “బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. ఆ సినిమాల ద్వారా మహేశ్ కు మంచి లాభాలే వచ్చాయి. కృష్ణ హీరోగా చిత్రాలు నిర్మించి, తరువాత ఆయనకు బ్యాలెన్స్ పెట్టిన వారు ఎందరో ఉన్నారు. అయినా కృష్ణ ఏమీ అనకుండా అలాంటి వారికి సైతం మళ్ళీ కాల్ షీట్స్ ఇచ్చేవారు. ఈ విషయంలో మాత్రం మహేశ్ బాబు చాలా నిక్కచ్చిగా ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోగా మహేశ్ బాబు సాగుతున్నారు. మునుముందు ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.