ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బి. గోపాల్ ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే స్మారక పురస్కారం అందుకున్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్ళుగా కేరళకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్యజిత్ రే స్మారక పురస్కారంతో సత్కరిస్తోంది.
Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
గతంలో ఈ అవార్డులను ఆదూర్ గోపాలకృష్ణన్ , బెంగాలీ నటి మధబ్ ముఖర్జీ , నిర్మాత జి. మోహన్ స్వీకరించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్, సంగీత దర్శకుడు పెరుంబవూర్ జీ రవీంద్రనాథ్తో పాటు పలువురు సినీ ప్రముఖులతో కూడిన ప్యానల్ ఇప్పుడీ అవార్డుకు దర్శకులు బి. గోపాల్ ను ఎంపిక చేసింది. రవీంద్రభారతిలో 12వ తేదీ సాయంత్రం జరిగిన సత్కార సభలో మామిడి హరికృష్ణతో పాటు సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీకి చెందిన సజన్ లాల్, సెబాస్టియన్, అజిత్ తదితరులు పాల్గొని, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. సత్యజిత్ రే వంటి గొప్ప దర్శకుని పేరుతో ఇస్తున్న అవార్డును స్వీకరించడం ఆనందంగా ఉందని బి. గోపాల్ అన్నారు. తెలుగు, హిందీ భాషలలో దాదాపు 35 చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు బి. గోపాల్ తాజాచిత్రం ‘ఆరుడుగుల బుల్లెట్’ గత వారమే విడుదలైంది.