మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉండటం, కీర్తి సురేష్ని గ్లామరస్గా చూపించడం లాంటివి మరింత హైప్ పెంచేశాయి. దాంతో దర్శకుడు పరుశురామ్ ఫ్యామిలీ డైరెక్టర్ అనిపించుకున్నప్పటికీ.. మాస్ పల్స్ పట్టేశాడని అంటున్నారు నెటిజన్స్. సర్కారు వారి పాటను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లా తీర్చిదిద్ది ఉంటాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే మహేష్ కామెడీ టైమింగ్.. తన మీద తనే సెటైర్స్ వేసుకోవడం.. తన మ్యానరిజం.. యాక్షన్ సీక్వెన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ అయిన గంటల్లోనే.. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతు.. ట్రెండింగ్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసింది సర్కారు వారి పాట ట్రైలర్. 24 గంటలు గడవక ముందే.. ఫాస్టెస్ట్ 25 మిలియన్స్కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే వన్ మిలియన్ కి పైగా లైక్స్ రావడంతో సర్కారు వారి పాట సంచలనంగా నిలిచింది. దాంతో 24 గంటల్లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని అంటున్నారు. ఇక ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. సర్కారు వారి పాటకు అన్నీ భలేగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. భీమ్లా నాయక్.. ట్రిపుల్ ఆర్.. తర్వాత వచ్చిన సినిమాల్లో డబ్బింగ్ సినిమా కెజియఫ్ టు మినహాయిస్తే.. మిగతా సినిమాలు అలరించలేకపోయాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఆచార్య కూడా అంతంత మాత్రంగానే నిలిచేలా ఉంది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, అలాగే మహేష్ అభిమానులు.. అందరూ చూడాలనుకునే కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది సర్కారు వారి పాట. దాంతో మే 12న రాబోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేయడం పక్కా అంటున్నారు. మరి అంచనాలను పెంచేసిన సర్కారు వారి పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
