హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో అల్లు అర్జున్ మినహా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు కాలేకపోయారు.
హీరో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారని వివరిస్తూ ‘ఆబ్సెంట్ పిటిషన్’ దాఖలు చేశారు. బన్నీ విచారణకు హాజరు కాలేని పరిస్థితులను న్యాయస్థానానికి నివేదించారు లాయర్లు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేకపోయారో ‘మెమో’ దాఖలు చేయాలని న్యాయవాదులను ఆదేశించారు. కేసులో నిందితులందరూ విచారణకు సహకరించాలని తదుపరి విచారణలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తరపున దాఖలైన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. వర్చువల్ గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతిస్తారా లేరా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈరోజు జరిగిన విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనలో చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడిగా) పేర్కొంటూ చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

