NTV Telugu Site icon

‘గాలివాన‌’లో సాయికుమార్, రాధిక!

బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన‌’ అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది జీ 5 సంస్థ. బి.బి.సి. స్టూడియోస్, నార్త్‌ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50 ఏళ్ళ క్రితం మొదలయిన తన కెరీర్ లో సాయి కుమార్ బాలనటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి.

ఈ వెబ్ సీరిస్ గురించి నిర్మాణ భాగస్వామి అయిన నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ”ఇటీవలే ఈ ఒరిజినల్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్‌తో బిబిసి రీజనల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది” అని తెలిపారు. ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.