‘హనుమాన్’ లాంటి గ్లోబల్ బ్లాక్బస్టర్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#SYG’ (సంబరాల ఏటిగట్టు) కి రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఒక కీలకమైన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.
ఈ సినిమాను కేవలం పేరుకే కాకుండా, నిజమైన పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ముంబై షెడ్యూల్తో మేకర్స్ నిరూపించారు. తాజాగా ముగిసిన ఈ షెడ్యూల్లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత గుర్తింపు పొందిన ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొని, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. జాతీయ స్థాయి నటుల ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ హిందీ స్టార్ క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ‘సంబరాల ఏటిగట్టు’ 2026లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

