Revenge: బాబు పెదపూడి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం `రివేంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్ర దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, డైరెక్టర్. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది” అని అన్నారు. మరో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ, ”హీరో కమ్ ప్రొడ్యూసర్ బాబు గారితో నాకు 12 ఏళ్ల పరిచయం. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న వ్యక్తి. దర్శకుడు శ్రీనివాస్ ఒక మంచి కథతో ఈ సినిమా రూపొందించారన్న విషయం ట్రైలర్ చూశాక అర్థమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
బాబు పెదపూడి మాట్లాడుతూ, ”మా ఫ్యామిలీ సపోర్ట్ తో విదేశాలకు వెళ్లాను. కానీ నాకు మొదటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. అబ్రాడ్ లో ఉంటూనే త్రివిక్రమ్ గారి ‘అతడు’, దశరథ్ గారి ‘శ్రీ’ సినిమాల్లో మంచి క్యారక్టర్స్ చేశాను. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్న బిజీ వల్ల చేయలేకపోయాను. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది. ఒక మంచి నటుడుగా నన్ను నిలబెట్టడం కోసం చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూశాక ఇది ఒక సైకో కథ అనిపించవచ్చు. కానీ బర్నింగ్ ప్రాబ్లమ్స్ మీద తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హర్ట్ ని టచ్ చేసే కథ. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతామన్నదే సినిమా” అని చెప్పారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ”మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజయ్ భాస్కర్, వంశీ వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేశాను. ‘పొదరిల్లు, ఐపిసి సెక్షన్’ అనే సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇది మూడోది. హీరో కమ్ ప్రొడ్యూసర్ బాబుగారితో పరిచయం అయిన తర్వాత మొదట క్యారక్టర్ రాసి ఆపైన దాని చుట్టూ కథ అల్లాను. ఇందులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇటీవలే మా మిత్రులకు షో వేసి చూపించాం. అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేత ప్రభాకర్, నిర్మాత, పంపిణీదారు శోభారాణి, ఆరోహి, అశోక్ రెడ్డి, చరణ్ సాయి, మోహన్ గౌడ్, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.