Brahma Muhurat: బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘‘రామాయణ’’ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. జూలై 30 తెల్లవారుజామున ‘‘బ్రహ్మ ముహూర్తం’’లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. “పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ‘రామాయణ’ ఉదయాన్ని ట్రైలర్తో స్వాగతిద్దాం” అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. సాధారణంగా సినిమా ట్రైలర్ల రిలీజ్తో పోలిస్తే తెల్లవారుజామున రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆసక్తి నెలకొంది. అసలు ‘‘బ్రహ్మ ముహూర్తం’’ అంటే ఏమిటి, దాని విశిష్టత, ప్రత్యేకత ఏంటని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి.?
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు ఉండే కాలాన్ని ‘‘బ్రహ్మ ముహూర్తం’’గా చెబుతారు. ఇది దేవుడి ఆరాధన, ప్రార్థన, ధ్యానం, ఆధ్యాత్మికత, జ్ఞాన సముపార్జనకు అత్యంత విశిష్టకాలంగా చెబుతుంటారు. ఈ ముహూర్తం సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమై, 48 నిమిషాల ముందు ముగుస్తుంది. సాధారణంగా ఉదయం 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఉంటుంది. రామాయణ ట్రైలర్ను ఉదయం 4.15 గంటలకు విడుదల చేస్తున్నారు.
ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటంతో ధ్యానం, ప్రార్థన, ఆలోచనలకు సానుకూలంగా ఉంటుందని హిందువులు విశ్వసిస్తుంటారు. చాలా మంది ఇదే సమయంలో స్నానాన్ని ఆచరించి దేవుడిని ఆరాధిస్తుంటారు. అనేక హిందూ ఆలయాల్లో తెల్లవారుజామునే పూజారులు సుప్రభాత సేవ నిర్వహించి, నిత్యపూజలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా శివాలయాల్లో అభిషేకాలు ఈ సమయంలోనే జరగడం ఆనవాయితీ. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయంతో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేక ఆరతి బ్రహ్మముహూర్తంలోనే చేస్తారు.
సైంటిఫిక్గా చూస్తే..
ఇక సైంటిఫిక్గా చూస్తే మన శరీరానికి 24 గంటల బయెలాజికల్ గడియారం ఉంటుంది. ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర హార్మోన్ ‘‘మెలటోనిన్’’ తగ్గడం ప్రారంభం అవుతుంది. ఇదే సమయంలో మన శరీరాన్ని మెలుకువ కోసం సిద్ధం చేసే ‘‘కార్టిసాల్’’ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. మెదడు మెలుకువకు రెడీ అవుతుంది. ఈ సమయంలో లేవడం వల్ల శరీర జీవక్రియలు సరిగా ఉంటాయి. మన శరీరంలో జీవగడియారం రిథమ్ సమన్వయంతో పనిచేస్తుంది. గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం, గాలి చాలా శుభ్రంగా ఉండటం వల్ల ధ్యానం వంటి వాటికి ఈ సమయం చాలా బాగుటుంది. శరీరంలో పారసింపథిక్ నర్వస్ సిస్టమ్( శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే వ్యవస్థ) చాలా చురుకుగా ఉంటుంది.
రామాయణ గురించి దేశం మొత్తం క్రేజ్..
నితేష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న ‘‘రామాయణ’’ రెండు పార్టులుగా విడుదల కాననుంది. మొదటి భాగం 2026 నవంబర్ 8న, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేశిగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారుగా రూ. 4000 కోట్లకు పైగా ఉంది.

