ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో సినిమాలో కచ్ఛితంగా కనిపించేది. దర్శకనిర్మాతలందరూ ఈమె డేట్స్ కోసం క్యూలో నిల్చునేవారు. అలాంటి భామ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగైంది. చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఈమె కోసం వేచి చూస్తుంటే.. ఈ భామ మాత్రం హిందీ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. దీంతో.. రకుల్ టాలీవుడ్కి గుడ్బై చెప్పేసిందా? అనే ప్రచారం మొదలైపోయింది. కానీ, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రకుల్ తాజాగా తేల్చి చెప్పింది.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించిన రకుల్కి ఓ అభిమాని నుంచి తెలుగు సినిమాల విషయమై ఒక ప్రశ్న ఎదురైంది. ‘‘మీరు భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో నటిస్తారా? లేక హిందీ చిత్రాలకే పరిమితం అయ్యారా?’’ అని ఆ ఫ్యాన్ ప్రశ్నించాడు. ఇందుకు రకుల్ బదులిస్తూ.. ‘‘నేను కచ్ఛితంగా తెలుగు సినిమాలు చేస్తాను. కాకపోతే నేను కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. నాకు ఛాలెంజింగ్గా అనిపించే స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాను. అవును, ప్రస్తుతానికి హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు ఎలాంటి భాషా బేధాలు లేవు. స్క్రిప్టే నాకు ముఖ్యం. నన్ను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ వస్తే, తప్పకుండా సినిమా చేస్తా’’ అని చెప్పుకొచ్చింది. మరి, రకుల్ కోరుకునే ఆ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఎప్పుడు దొరుకుతుందో? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.
కాగా.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో నటించి, కొన్నాళ్లు ఇండస్ట్రీలో చక్రం తప్పింది. ఇంతలో ఇతర భామల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, రకుల్ ఇటు బాలీవుడ్లోనూ దృష్టి సారించడంతో.. తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ భామ హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఇవి విడుదల కానున్నాయి.
