Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ

Rajinikanth

Rajinikanth

Dharman : సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు మారారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కథను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని స్వయంగా రజనీ వెల్లడించారు. దీంతో అసలు ఈ సినిమా వెనుక ఏం జరిగిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.  నిన్న చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రజనీకాంత్ 173వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధర్మన్ : ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. టైటిల్‌తోనే ఈ సినిమా కథపై ఆసక్తి పెంచిన మేకర్స్, భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఈ వేదికపై మాట్లాడిన రజనీకాంత్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించాల్సి ఉందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ ముందుకు సాగలేదని చెప్పారు. అనంతరం దర్శకుడు సుందర్ సీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని, అయితే ఆయనకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా సినిమా ఆలస్యం కావడంతో చివరకు ఆయన కూడా తప్పుకున్నారని వెల్లడించారు. దీని తర్వాత దర్శకుడు సిబి చక్రవర్తి ఒక విభిన్నమైన కథతో ముందుకు వచ్చారని రజనీకాంత్ తెలిపారు. అణు శాస్త్రవేత్త, అణ్వాయుధాల నేపథ్యంతో సాగే ఆ కథ తనకు బాగా నచ్చిందని, షూటింగ్‌ను ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి దేశాల్లో నిర్వహించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని చెప్పారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత సున్నితమైన అంశాన్ని చూపించే కథ కావడం, భారీ స్థాయిలో చిత్రీకరణ అవసరం ఉండటం, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ కథను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.

అలాంటి పరిస్థితుల్లోనే దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని రజనీ చెప్పారు. అతను వినిపించిన కథ తనకు కొత్తగా అనిపించిందని, అభిమానులు ఆశించే వినోదంతో పాటు బలమైన కథనాన్ని అందిస్తుందని నమ్మకంతో ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవల యువ దర్శకులతో పని చేయడంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్న రజనీకాంత్, మరోసారి కొత్త తరానికి అవకాశం ఇవ్వడం విశేషం. కమల్ హాసన్ నిర్మాణం, రజనీకాంత్ కథానాయకుడిగా నటించడం, యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించడం వంటి అంశాలు ‘ధర్మన్ ది డెడ్లీ డాక్టర్’పై భారీ అంచనాలను ఏర్పడ్డాయి. అంతేకాదు నలుగురు దర్శకుల మార్పుల తర్వాత ఈ ప్రాజెక్ట్ చివరకు పట్టాలెక్కడం, రజనీ స్వయంగా ఆ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోవడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో ప్రారంభమైన ఈ హైప్, త్వరలో విడుదలయ్యే గ్లింప్స్, టీజర్‌లతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.