విలక్షణ నటుడు రఘువరన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్.
రఘువరన్ 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడెలో జన్మించారు. ఆయన తండ్రి హోటల్ నడిపేవారు. మధురలో హోటల్ నడుపుతున్న ఆయన తండ్రి తరువాత కొయంబత్తూరుకు మకాం మార్చారు. అక్కడే రఘువరన్ విద్యాభ్యాసం సాగింది. బి.ఏ., చదువుతూ దానిని వదలివేసి, మద్రాసు అడయార్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. తరువాత ఓ కన్నడ చిత్రంలో నటించారు. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. మాతృభాష మళయాళంలో ‘కాక్క’ అనే సినిమా కాసింత గుర్తింపు సంపాదించి పెట్టింది. తరువాత ‘ఎలవత్తు మణిదన్’ తమిళ చిత్రంలో తొలిసారి హీరోగా నటించారు రఘువరన్. అప్పట్లో రఘువరన్ ను చూసి, అచ్చు ఉత్తరాది హీరోలా ఉన్నాడని అందరూ భావించారు. “ఒరు ఒడై నాదియగిరతు, నీ తోడుంబోతు, ఎన్గిరుందలుమ్ వళ్గా” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ రాణించారు. తెలుగులో విజయం సాధించిన వెంకటేశ్ మూవీ ‘బ్రహ్మపుత్రుడు’ను తమిళంలో ‘మైఖేల్ రాజా’గా డి.రామానాయుడు రీమేక్ చేశారు. అందులో రఘువరన్ హీరోగా నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రఘువరన్ విలక్షణమైన పాత్రల్లో రాణించాలని తపించేవారు. అందువల్ల ఎప్పుడూ హీరో వేషాలు వేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. దాంతో విలన్ గా అలరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలుగు చిత్రం ‘పసివాడి ప్రాణం’తో విలన్ గా తెలుగుజనానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా ఘనవిజయంతో తెలుగులో రఘువరన్ కు విలన్ పాత్రలే పలకరించడం మొదలెట్టాయి.
Also Read
రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లోనూ రఘువరన్ విలన్ గా నటించారు. ఆ సినిమా ఘనవిజయంతో రఘువరన్ అంటే విలన్ అనే పేరు సంపాదించారు. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ రఘువరన్ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో బిజీ విలన్ గా సాగారాయన. మణిరత్నం ‘అంజలి’లో మళ్ళీ కథానాయకునిగా కనిపించారు. కానీ, ఆయనకు తరువాత హీరో వేషాలు అంతగా పలకరించలేదు. ఆ తరువాత నుంచీ కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తూ సాగారు. ‘సుస్వాగతం’లో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు రఘువరన్.
ఒకప్పుడు బాలనటిగా భళా అనిపించిన రోహిణిని పెళ్ళాడారు రఘువరన్. వాళ్ళకు ఓ అబ్బాయి పేరు రిషి వరన్. 2004లో రోహిణి నుండి విడిపోయారు. ఆల్కహాల్ కు బానిస అయిన రఘువరన్ రాత్రిపగలు తేడాలేకుండా తాగేవారు. దాంతో ఆయన అవయవాలు బాగా దెబ్బతిన్నాయి. 2008 మార్చి 19న రఘువరన్ కన్నుమూశారు. రఘువరన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ‘ట్రినిటీ కాలేజ్’లో పియానో నేర్చుకున్నారు. సొంతగా పాటలు కంపోజ్ చేసుకొని మురిసిపోయేవారు. ఆయన కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను తరువాత ఓ ఆల్బమ్ గా తీసుకువచ్చారు. రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైన ఈ ఆల్బమ్ ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన అభినయం జనం మదిలో ఓ స్థానం సంపాదించింది.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!