Priyanka Chopra About SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారణాసిలో రామాయణ ఎపిసోడ్ ఉన్నప్పటికీ.. కోర్ ఎలిమెంట్ మాత్రం తండ్రీకొడుకుల సెంటిమెంట్ అనే విషయాన్ని జక్కన్న ఇప్పటికే బయటపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మైండ్ బ్లాక్ అయింది:
‘భారతీయ ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులపై చూపించే ప్రేమ, అభిమానం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకం. భారత్లో సినిమాలు, క్రికెట్కు వినోద రంగంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్లో జరిగిన వారణాసి కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహేష్ సర్ క్రేజ్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. వారణాసి నా తొలి పూర్తిస్థాయి తెలుగు సినిమా. తెలుగు ప్రేక్షకులు నన్ను, పృథ్వీరాజ్ సుకుమారన్ను ఎంతో ఆత్మీయంగా స్వాగతించడం ఆనందంగా ఉంది’ అని ప్రియాంక చోప్రా చెప్పారు.
నన్నే ఊహించుకున్నానని చెప్పారు:
‘నాకు తెలుగు భాష తెలియకపోవడంతో బాగా ఇబ్బంది పడ్డాను. ఒక సవాలుగా అనిపించింది. కానీ రాజమౌళి సర్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ప్రతి సన్నివేశం బాగా రావడానికి ఆయన ఎంతో సహకరించారు. లాస్ ఏంజెలిస్లో ఆర్ఆర్ఆర్ సినిమా అకాడమీ అవార్డుల కార్యక్రమం జరిగింది. అప్పుడే రాజమౌళి గారిని తొలిసారి కలిశా. ఆ సమయంలో ఆయన కుటుంబంతో కూడా పరిచయం ఏర్పడింది. దాదాపు ఏడాది తర్వాత రాజమౌళి నుంచి నాకు కాల్ వచ్చింది. వారణాసి సినిమాలోని కథానాయిక పాత్ర అద్భుతంగా ఉంటుందని, ఆ పాత్ర కోసం నన్నే ఊహించుకున్నానని చెప్పారు. రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాటతో వెంటనే మూవీ అంగీకరించా’ అని ప్రియాంక తెలిపారు.
నటీనటులకు లభించే గొప్ప అవకాశం:
‘రాజమౌళి సినిమాల కోసం చేసే ముందస్తు ప్రణాళిక, రిహార్సల్స్ నటీనటులకు ఎంతో ఉపయోగపడతాయి. ఏదైనా కీలక సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు పూర్తి ఎమోషన్స్తో రిహార్సల్ చేయించి, దాన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేస్తారు. దీంతో షూటింగ్ సమయంలో ప్రతి నటుడికి తానూ ఎలా యాక్ట్ చేయాలి, సన్నివేశం ఎలా ఉండాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది. ఇది నటీనటులకు లభించే గొప్ప అవకాశం. వారణాసిలో విజువల్ ఎఫెక్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్ సెట్స్ కూడా సినిమాకు సహజత్వాన్ని తీసుకొస్తాయి. వారణాసి వంటి నిజమైన ప్రదేశాల్లో భారీ చిత్రీకరణ చేయడం కష్టం. అందుకే రాజమౌళి సర్ అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన సెట్ను నిర్మించారు’ అని ప్రియాంక పేర్కొన్నారు.
కెరీర్లో మర్చిపోలేని అనుభూతి:
ఆఫ్రికాలో జరిగిన షూటింగ్ అనుభవాన్ని కూడా ప్రియాంక చోప్రా గుర్తుచేసుకున్నారు. నిజమైన క్రూరమృగాలు, ఏనుగుల మధ్య సురక్షితమైన వాతావరణంలో చిత్రీకరణ జరగడం ఎంతో థ్రిల్లింగ్గా అనిపించిందన్నారు. ఆ అనుభవం తనకు ప్రత్యేకమైనదిగా నిలిచిపోయిందని చెప్పారు. వారణాసి చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం, రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడం తన కెరీర్లో మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని ప్రియాంక చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న వారణాసి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

