Preity Zinta: సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కోర్టుల తలుపు తడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా చేరారు. తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏఐ ఫేక్ కంటెంట్ను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆమె కోర్టుకు వివరించారు. అలాంటి వాటిని తక్షణమే తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ను అప్లోడ్ చేయకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టులో జస్టిస్ మాధవ్ జామ్దార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, అభ్యంతరకరమైన కంటెంట్ను తొలగించేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని సంబంధిత ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. గత కొంతకాలంగా డీప్ఫేక్ టెక్నాలజీ కారణంగా పలువురు ప్రముఖులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జాకీ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు కూడా అశ్లీల ఫేక్ కంటెంట్ తొలగించమని ఇదివరకే కోర్టులను ఆశ్రయించారు. అలాగే రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ వంటి నటీమణుల డీప్ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగంపై కఠిన నియంత్రణ అవసరమనే అభిప్రాయం అయితే బలపడుతోంది.
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రీతి జింటా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. సన్నీ డియోల్తో కలిసి నటించిన ‘బంత్వారా’ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, మరోవైపు డిజిటల్ ప్రపంచంలో డీప్ఫేక్ వీడియోల కోసం న్యాయపోరాటం ప్రారంభించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

