సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్స్ వద్ద తీవ్ర అడ్డంకి ఏర్పడింది. అంతకు ముందున్న రేట్లనే అమ్మాలని సినిమాపై ఆంక్షలు విధించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సమస్యపై నటుడు ప్రకాష్ రాజ్ తన స్పందన తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు?ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
