తెలుగు చలన చిత్ర చరిత్రలో పరుచూరి బ్రదర్స్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. రచయితలుగా, దర్శకులుగా, నటులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు కూడా ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తున్నాడు. వెంకటేశ్వరరావు తనయుడు రవీంద్రనాథ్ కొడుకైన సుదర్శన్ హీరోగా శనివారం ‘సిద్ధాపూర్ అగ్రహారం’ సినిమా మొదలైంది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి. గోపాల్ క్లాప్ ఇవ్వగా, పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్ను యూనిట్కు అందజేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య , వీరూ పొట్ల ముఖ్య అతిథులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ”ఏ రైతైనా తన కొడుకు చేతికి నాగలి ఇవ్వాలనుకుంటాడు. మా నాన్నగారు అలానే అనుకున్నారు. కానీ మేం కలం పట్టుకున్నాం. మా రవీంద్రనాథ్ కూడా కలం పట్టుకున్నాడు. కానీ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా క్లాప్ కొట్టించుకున్నాడు. ఎంత గొప్ప విద్యావంతుడికైనా వినయం లేకపోతే అతని విద్య శోభించదు. అలాగే గర్వం మనల్ని వెనక్కి లాగుతుంది. ‘సిద్థాపూర్ అగ్రహారం’ టైటిల్లోనే సిద్ధా అని ఉంది. సిద్ధ అంటే సిద్ధం అని అర్థం. ఈ చిత్రం సుదర్శన్కు యాక్టర్గా మంచి జీవితాన్ని ప్రసాదించాలి. అలాగే సుదర్శన్ ఇండస్ట్రీలో అద్భుతమైన కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు సుదర్శన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ‘ప్రతిధ్వని’ చిత్రంలో నేను రాజకీయం గురించి ఓ డైలాగ్ చెప్పాను. ఇప్పుడు సుదర్శన్ ఆ డైలాగ్ చెబుతుంటే నాకు ఒళ్లు పులకరించి పోతుంది. అన్న ఎన్టీఆర్ గారి ఎత్తు, సుదర్శన్ ఎత్తు ఒకటే. ఆయన అంత స్థాయికి ఎదిగే ప్రయత్నం సుదర్శన్ చేయాలని, చాలా కష్టపడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
హీరో సుదర్శన్ మాట్లాడుతూ, ”నేను హీరో అవుదామని అనుకోలేదు. కానీ దర్శకుడు కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. యాక్టర్గా మంచి సినిమాలు చేయాలని అనుకుంటు న్నాను. ‘సిద్ధాపూర్ అగ్ర హారం’ మంచి సినిమా అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. నిర్మాతలు వాసు తిరుమల, ఉష శివకుమార్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. సుదర్శన్ను మా బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాం. దర్శకుడు రాకేష్ గారు చాలా కష్టపడుతున్నారు’’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ రాజ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండున్నర సంవత్సరాలుగా దర్శకుడు రాకేష్ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్గార్లు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం’’ అని చెప్పారు.
