Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన సోదరుడిపై గొడ్డలితో దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలాలో జూన్ 21న ఈ ఘటన జరిగింది. పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీ, చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదం నేపథ్యంలో తన పొరుగువారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ వివాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో, రాజేష్ సాహ్ అనే వ్యక్తి గొడ్డలితో విజయేంద్రనాథ్ తివారీపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్ తివారీని స్థానికులు వెంటనే గోపాల్గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను పాట్నాకు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వార్త వెలుగులోకి రావడంతో పంకజ్ త్రిపాఠి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సదర్ 2 ఎస్డీపీఓ, మాధోపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలితో పాటు నిందితుడు ధరించిన రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ దాడికి ప్రధాన కారణం చాలా కాలంగా కొనసాగుతున్న భూ వివాదమేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన రాజేష్ సాహ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తూ, విజయేంద్రనాథ్ తివారీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

