ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొంతమంది విరాళాలు సేకరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చారిటీ పేరుతో భారీగా విరాళాలు సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆఫీస్ పేర్కొంది. అయితే, ఈ తరహా కార్యక్రమాలకు ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన వీటిని ఏ విధంగానూ ఆమోదించడం లేదని, ఇవి పూర్తిగా అనధికారికమని తేల్చి చెప్పింది.
ఎన్టీఆర్ గారితో లేదా ఆయన కార్యాలయంతో సంబంధం ఉన్నట్లుగా నమ్మిస్తూ సాగిస్తున్న ఇటువంటి కార్యకలాపాలకు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని ప్రజలను, శ్రేయోభిలాషులను కోరారు. అభిమానులు అప్రమత్తంగా ఉండి మోసపోకుండా ఉండాలని సూచించారు. సామాజిక కార్యక్రమాలు లేదా ఏదైనా ముఖ్యమైన ప్రకటనలు ఉంటే నేరుగా ఎన్టీఆర్ గారి ద్వారా లేదా ఆయన అధికారిక కార్యాలయం ద్వారా మాత్రమే వెల్లడించబడతాయని ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వర్గాల నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు ఎటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అభిమానులు చూపుతున్న నిరంతర ప్రేమకు, అందిస్తున్న సహకారానికి ఎన్టీఆర్ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.
