Site icon NTV Telugu

Devisri Prasad Birthday: మ్యూజిక్‌తో దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్

Devisriprasad

Devisriprasad

Devisri Prasad Birthday: తండ్రి చేయి తిరిగిన రచయిత. తనయుడేమో సప్త స్వరాలతో సావాసం చేస్తూ చేతులు అలా ఇలా తిప్పేస్తూ మాయ చేసి మత్తు చల్లేలా సంగీతం సమకూర్చగల మేటి. ఆ తండ్రి సత్యమూర్తి. ఆయన పెద్దకొడుకు దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో ఏ లాంటి మ్యాజిక్ చేస్తాడో ప్రత్యేకించి తెలుగువారికి చెప్పనవసరం లేదు.

దేవిశ్రీ ప్రసాద్ 1979 ఆగస్టు 2న తూర్పు గోదావరి జిల్లా వెదురుపాకలో జన్మించాడు. బాల్యం నుంచీ దేవిశ్రీ ప్ర‌సాద్ కు సంగీతం అంటే ప్రాణం. త‌న‌యునిలోని ప్ర‌తిభ‌ను గ‌మ‌నించిన స‌త్య‌మూర్తి సైతం ఎంత‌గానో ప్రోత్స‌హించారు. దాంతో టీనేజ్ లోనే దేవిశ్రీ బాణీలు క‌ట్ట‌డం నేర్చారు. బాల‌మేధావిగానూ జేజేలు అందుకున్నారు దేవిశ్రీ‌. కొంద‌రు సంగీత ద‌ర్శకులు సైతం దేవిశ్రీ‌ని ప్రోత్స‌హించారు. డాన్స్ పార్టీ అనే స్టూడియో ఆల్బ‌మ్ లోని ఎనిమిది పాట‌ల్లో ఓ పాట‌కు దేవిశ్రీ స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. అలా తొలిసారి త‌న బాణీల‌ను లోకానికి ప‌రిచ‌యం చేసిన దేవిశ్రీ‌కి ప్ర‌ముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు, ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ త‌మ కాంబోలో వ‌చ్చిన ‘దేవి’ చిత్రం ద్వారా తొలి అవ‌కాశం క‌ల్పించారు. ఆ సినిమాతోనే దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న‌దైన బాణీ ప‌లికించారు. అత‌నిలోని ప్ర‌తిభ‌ను గుర్తించిన శ్రీ‌ను వైట్ల త‌న ‘ఆనందం’ చిత్రానికి దేవిని సంగీత ద‌ర్శ‌కునిగా ఎంచుకున్నారు. ఆ చిత్రంలోని పాట‌ల‌తోనూ జ‌నాన్ని ఆక‌ట్టుకున్నారు దేవిశ్రీ‌.

ఇర‌వై మూడేళ్ళుగా దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌యాత్ర‌లో జ‌నం మ‌దిని దోచిన అమృత‌గుళిక‌లు ఎన్నో ఉన్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీల‌కు చిందేయ‌ని సినిమా హీరోల అభిమానులంటూ ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రి చిత్రాల‌కూ త‌న సంగీతంతో మ‌ర‌పురాని మ‌ధురాన్ని పంచారు దేవిశ్రీ‌. అందుకే ఆయ‌న బాణీల‌తో ఓ సినిమా వ‌స్తోందంటే చాలు అభిమానులు ఆశ‌గా, ఆస‌క్తితో ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఎదురుచూపుల‌కు ఆనందం క‌లిగించేలా దేవిశ్రీ స్వ‌ర‌క‌ల్ప‌న సాగుతూనే ఉంది. ఇప్ప‌టి దాకా దేవిశ్రీ స్వ‌ర‌క‌ల్ప‌న‌కు నంది అవార్డును సంపాదించిపెట్టిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ అనే చెప్పాలి. అత‌ను అందుకున్న ప్ర‌భుత్వ అవార్డుల క‌న్నా మిన్న‌గా ప్రేక్ష‌కుల రివార్డులు మాత్రం ల‌భిస్తూనే ఉన్నాయి. ఇర‌వై మూడేళ్ళ సంగీత ప్ర‌స్థానంలో దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో దాదాపు వందకు పైగా చిత్రాలు జ‌నం ముందు నిలిచాయి. వాటిలో అధిక‌శాతం ప్రేక్ష‌కుల మ‌దిని గెలిచాయి. తన బాణీలతో జనాన్ని చిందేయించడమే కాదు, గాత్రంతోనూ ఉర్రూతలూగించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆయ‌న సంగీత‌జైత్ర‌యాత్ర‌తో టాప్ స్టార్స్ సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

చిరంజీవి రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌డానికి ముందు వ‌చ్చిన ‘శంక‌ర్ దాదా జిందాబాద్’కు త‌రువాత ఆయ‌న రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబ‌ర్ 150’ కి కూడా దేవిశ్రీ బాణీలు అల‌రించాయి. ఇక బాల‌కృష్ణ ‘లెజెండ్’ చిత్రంలో “హీ ఈజ్ ద లెజెండ్…” పాట‌తో యావ‌త్ తెలుగునేల‌ను ఓ ఊపు ఊపేశారు. ద‌క్షిణ భార‌తంలో అత్య‌ధిక రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన చిత్రంగా ‘లెజెండ్’ నిల‌చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచిన “జ‌ల్సా, గ‌బ్బ‌ర్ సింగ్, అత్తారింటికి దారేది” చిత్రాల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ప‌లికించిన బాణీల‌ను ఎవ‌రు మాత్రం మ‌ర‌చిపోగ‌ల‌రు? ఇక మ‌హేశ్ ‘శ్రీ‌మంతుడు’కు దేవి స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌లు ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌భాస్ ‘మిర్చి’లో దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ చేసిన మ్యాజిక్ ను ఎవ‌రూ మర‌చిపోలేరు. జూ.య‌న్టీఆర్ “నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్” లోని పాట‌లు, న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అల్లు అర్జున్ ను ‘ఆర్య‌’తో స్టార్ హీరోగా నిల‌ప‌డంలోనూ, ‘పుష్ప’గా ఆకట్టుకొనేలా చేయడంలోనూ దేవి స్వరాలు భలేగా పనిచేశాయి. రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’లో చిందేయ‌డంలోనూ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలే బాస‌ట‌గా నిలిచాయి. ఈ టాప్ హిట్స్ తోనే కాదు ఇత‌ర యంగ్ హీరోస్ చిత్రాల‌కూ దేవిశ్రీ ప్ర‌సాద్ ప‌లుమార్లు ప‌సందైన సంగీతం అందించారు. అందుకే స్టార్ హీరోస్ అందరూ ఈ నాటికీ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అభిమానిస్తున్నారు. ఈ పుట్టిన‌రోజు త‌రువాత దేవిశ్రీ ప్ర‌సాద్ మ‌రింత మ‌ధురాన్ని పంచుతూ జ‌నాన్ని మురిపిస్తార‌ని ఆశిద్దాం.

(ఆగ‌స్టు 2న దేవిశ్రీ ప్ర‌సాద్ పుట్టిన‌రోజు)

Exit mobile version