Srihari: రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ఇప్పటికే రెండు మూడు చిత్రాలలో హీరోగా నటించాడు. అతని తాజా చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. రియా సచ్ దేవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జి. భవానీ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎ2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యారాణి, స్వరూపరాణి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి, చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు అందించారు. పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోపీ సుందర్ స్వర రచన చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ, “ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి కృతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేస్తున్నాను. గోపీసుందర్, రామ్ ప్రసాద్ గారు లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు’’ అని అన్నారు. దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ.. “ఈ కథని నమ్మి ఎక్కడా రాజీపడకుండా గొప్పగా నిర్మిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఎ 2 పిక్చర్స్ కి ఎప్పుడూ రుణపడి వుంటాను. గోపీ సుందర్ గారు ఇచ్చిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయ్. ఇందులో బ్రహ్మ పాత్రను సౌత్ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో చేయబోతున్నారు. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్ ఎంటర్ టైనర్” అని చెప్పారు. గోపీ సుందర్ మాట్లాడుతూ “దర్శకుడు భవానీ చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో ఆరు పాటలు వుంటాయి. ఇది ఫుల్ ప్యాకేజ్. సబ్జెక్ట్ చాలా కొత్తగా వుంటుంది. అందరూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు. ఈ సినిమా విజయంపై హీరోయిన్ రియా సచ్ దేవ, నిర్మాతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.