Mansoor Ali Khan: కోలీవుడ్ లో సినిమాల కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల నుంచి నటుడు మన్సూర్ ఆలీఖాన్ గురించే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించిన మన్సూర్.. తగ్గేదేలే అంటూ.. ఇంకా ఇంకా ఆ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న మీడియా ముందు త్రిష, ఖుష్బూ, చిరంజీవి మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చిన మన్సూర్.. ఇప్పుడు అస్సలు త్రిషకు సారీనే చెప్పలేదని ప్లేట్ మార్చదు. కొన్ని రోజుల క్రితం మన్సూర్ సారీ చెప్పినట్లు ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే. అందులో.. “నేను కత్తి లేకుండా.. ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను.. ఏదిఏమైనా కూడా నా మాటలతో త్రిష మనసు బాధపెట్టినందుకు క్షమాపణ చెబుతున్నా.. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసిందనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఇక మన్సూర్ క్షమాపణను మంచి మనసుతో త్రిష కూడా స్వీకరించినట్లు ట్వీట్ చేసింది.
ఇక్కడితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు. కానీ, మన్సూర్ కొత్త వివాదానికి తెరలేపాడు. త్రిషకు తాను సారీ చెప్పలేదని ప్లేట్ తిప్పాడు. ” నేను నా మేనేజర్ తో మాట్లాడినప్పుడు.. త్రిషకు క్షమాపణలు అనే మాట రాలేదని, అతను తప్పుగా అనుకోని క్షమాపణలు కోరినట్లు రాసుకోచ్చాడని చెప్పుకొచ్చాడు.. నేను త్రిషకు సారీ చెప్పడం ఏంటీ .. పెద్ద జోక్ ఇది అని కొట్టిపారేస్తూ నవ్వుకొచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మన్సూర్ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
