అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ మంచి మెజారిటీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఈరోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి, పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ ఫైల్ పై సంతకం చేశాడు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ నిన్న తమ పదవులకు రాజీనామా చేసారు. వారంతా ‘మా’లో సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే తాము గెలిచినప్పటికీ తమ పదవులను వదిలేసి కేవలం మంచు విష్ణు బృందం పనితీరును గమనిస్తామని, అవసరమైతే ప్రశ్నిస్తామని అన్నారు.
Read Also : ఎందుకు ఏడుస్తున్నారు ? ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నరేష్ కౌంటర్
ఇక ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ, బ్యాలెట్ పత్రాలను ఇంటికి తీసుకెళ్లారని, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎన్నికల అధికారి తన ఇంటికి బ్యాలెట్ పత్రాలని తీసుకెళ్లడం గురించి చర్చ జరుగుతోందని నటి అనసూయ సోమవారం ట్వీట్ చేసింది. “అంటే మరి నిన్న ఎవరో ఎన్నికల నియమావళికి భిన్నంగా బ్యాలెట్ పత్రాలని ఇంటికి కుడా తీసుకెళ్లారని… అహ అంటే బయట టాకు నడుస్తోంది… నేనట్లేదు” అని అనసూయ ట్వీట్ చేసింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నటుడు ప్రభాకర్ కూడా ఇదే ఆరోపణ చేశారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ “నా ఇంటికి బ్యాలెట్ పత్రాలను తీసుకెళ్లడంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. నేను బ్యాలెట్ పత్రాలు ఉంచిన బాక్సుల కీలను మాత్రమే తీసుకున్నాను” అని స్పష్టం చేశారు.