Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!

Tollywood (2)

Tollywood (2)

Kushboo Sundar: సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫైర్ బ్రాండ్ ఖుష్బూ సుందర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక – శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఖుష్బూ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్‌గా ఖుష్బూ, ఆమె భర్త, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుందర్ సి.. కాబోయే వధూవరులు అవంతిక – శ్రవణ్‌లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. పార్లమెంట్ వేదికగా వారిని సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోడీ.. వివాహ ఆహ్వాన పత్రికను అందుకున్నారు. అనంతరం కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్‌లోనూ తమకు సమయం కేటాయించినందుకు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని ఢిల్లీలో కలవడం మాకు దక్కిన గొప్ప గౌరవం. నా భర్త సుందర్ సి, నేనూ కలిసి మా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాం. ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఖుష్బూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అభిమానులు, నెటిజన్లు కాబోయే కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫోటోల్లో ఖుష్బూ ట్రెడిషనల్ పింక్ సిల్క్ శారీలో మెరిసిపోగా.. అవంతిక – శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా కనిపించారు.

×
×
Ad