మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kaantha) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1940–50 దశకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియడ్ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అటువంటి సమయంలో రానా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సర్ప్రైజ్ రివీల్ చేశారు.
Also Read : Kajol : 26 ఏళ్ల తర్వాత.. మ్యరెజ్ లైఫ్ కి ఎక్స్పైరీ డేట్ ఉండాలి అంటున్న.. కాజోల్
రానా మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో 1957లో విడుదలైన క్లాసిక్ బ్లాక్బస్టర్ ‘మాయాబజార్’, అలాగే ‘పాతాళ భైరవి’ చిత్రాల షూట్కి ఉపయోగించిన మిచెల్ కెమెరానే మళ్లీ వినియోగించాం. పాతకాలపు విజువల్ టెక్స్చర్ కావాలనే ఉద్దేశంతో ఆ కెమెరాను వాడాం,” అని తెలిపారు. ఆ కెమెరా తమ వద్దకు ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా రానా వివరించారు. “నా తండ్రి, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొన్నేళ్ల క్రితం వాహిని స్టూడియో నుంచి ఆ మిచెల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ‘కాంత’ కోసం దానిని మళ్లీ ఉపయోగించాం. ఆ కెమెరాతో తీసిన ఓ సీన్ ట్రైలర్లో కూడా ఉంది. అది నాకు చాలా స్పెషల్గా అనిపించింది” అని రానా చెప్పుకొచ్చారు. ఈ సర్ప్రైజ్ రివీల్తో సినిమా చుట్టూ మరింత హైప్ పెరిగింది. మిచెల్ కెమెరాతో చిత్రీకరించిన ఆ విజువల్స్ తెరపై ఎంత మాయ చూపిస్తాయో నవంబర్ 14న సినిమా విడుదలైన తర్వాత చూడాలి.
