CM NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ను ఏకకాలంలో ఐదు భాషల్లో మేకర్స్ అత్యంత అట్టహాసంగా విడుదల చేశారు. ఈ క్రమంలో తారక్ వీరాభిమానుల కోసం హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా అందులో బాలానగర్లోని విమల్ థియేటర్ కూడా ఒకటి. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం విమల్ థియేటర్ వద్దకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా పోటెత్తారు. తారక్ కటౌట్లతో ఆ ప్రాంతమంతా ఓ మాస్ జాతరను తలపించింది. విమల్ థియేటర్ ఆవరణలో అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ హీరో స్క్రీన్ మీద కనిపిస్తుంటే అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ దద్దరిల్లింది.
భారీ కటౌట్లను ఏర్పాటు చేసిన ఫ్యాన్స్.. వాటికి పాలాభిషేకాలు చేసి, హారతులు ఇచ్చారు. బాణసంచా కాల్పులతో బాలానగర్ ఏరియా మొత్తం మార్మోగిపోయింది. తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో హోరెత్తించారు. ఈ వేడుకలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం అభిమానుల నినాదాలు. ఎన్టీఆర్కు బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు.. “సీఎం.. సీఎం..” అంటూ థియేటర్ ప్రాంగణంలో వాళ్లు చేసిన నినాదాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో అభిమానులు చేస్తూనే ఉన్నారు. అప్పట్లో టిడిపికి సన్నిహితంగా మెలిగిన తారక్ కొన్ని ఎన్నికల్లో ప్రచారం సైతం చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలకు టిడిపికి సైతం కాస్త దూరంగా సినిమాలకు దగ్గరగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల విజయ్ సీఎంగా ఎన్నికైన క్రమంలో కూడా ఆ తర్వాత తారక్ కు మాత్రమే ఆ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఇక ఇప్పుడు అది నిజమనిపించేలా రాత్రి ఎన్టీఆర్ అభిమానులు సీఎం నినాదాలతో ప్రూవ్ చేశారు.
